భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ (Betting Apps) వ్యవహారంలో దర్యాప్తు వేగవంతం చేశారు అధికారులు. ఈ కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) (Special Investigation Team)ఏర్పాటుకు డీజీపీ జితేందర్ (DGP Jitender) ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది. సిట్ బృందంలో ఐజీ రమేష్తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రాకాంత్, డీఎస్పీ శంకర్ సభ్యులుగా ఉండనున్నారు.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ఇప్పటికే పంజాగుట్టతో పాటు సైబరాబాద్, మియాపూర్ పోలీస్ స్టేషన్ల్లో కేసులు నమోదయ్యాయి. టాలీవుడ్, బాలీవుడ్కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన రెండు కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ అధికారిక ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని సిట్కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారం సెలబ్రిటీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులపై కేసులు నమోదు అయ్యాయి. బెట్టింగ్ యాప్స్, గేమింగ్పై తెలంగాణ ప్రభుత్వం గతంలో నిషేధం విధించింది. ఆన్లైన్ గేమ్లు ఆడినా ప్రోత్సహించినా శిక్షార్హులు. ఆన్లైన్, సోషల్ మీడియాలో బెట్టింగ్కు ప్రచారం కల్పించడం, వాటిని ప్రోత్సహించడం కూడా నిషేధం. ఈ నిబంధనలను ఉల్లంఘించి ప్రచారం చేస్తే వినియోగదారుల పరిరక్షణ చట్టం- 2019 కింద కేసులు నమోదు చేస్తారు. ఇకపోతే కేంద్రం కూడా ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లపై ఆయా రాష్ట్రాలు చట్టాలు చేసుకొవచ్చని స్పష్టం చేసింది. వీటిని కట్టడి చేసేందుకు కేంద్రం కూడా చర్యలు తీసుకుంటుందని పేర్కొంది.