భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రైవేట్ సెక్రటరీ (Personal Secretary)గా నిధి తివారీ (Nidhi Tiwari)ని కేంద్ర ప్రభుత్వం (Central Govt) నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. 2022 నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయం (PMO)లో డిప్యూటీ సెక్రటరీ హోదాలో నిధి తివారీ పనిచేస్తున్నారు. అంతకుముందు, విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా సేవలు అందించారు. తాజాగా మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా ఆమె నియమితులయ్యారు.
ఇక నిధి తివారీ విషయానికి వస్తే 2013 సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ సాధించారు. ఆమె వారణాసిలోని మెహముర్గంజ్ ప్రాంతానికి చెందినవారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించే ముందు, ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్)గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే సివిల్ పరీక్షకు సిద్ధమై విజయాన్ని సాధించారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రికి ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు వివేక్ కుమార్, హార్దిక్ సతీశ్ చంద్ర షా ఉండగా.. ఇప్పుడు మూడో ప్రైవేట్ కార్యదర్శిగా నిధి తివారీ నియమితులయ్యారు.
2023 జనవరి 6వ తేదీ నుంచి పీఎంవోలో నిధి తివారీ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలోనూ పని చేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పీఎంవోలో కీలకపాత్ర పోషించే స్థాయికి తీసుకొచ్చిందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. త్వరలోనే ప్రధాని ప్రైవేట్ సెక్రటరీగా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.