భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) లోక్సభ (Loksabha) ముందుకు వచ్చింది. ఈ బిల్లుని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Union Minister Kiren Rijiju) లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. వారి నిరసనల నడుమే బుధవారం మధ్యాహ్నం కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లుపై చర్చ చేపట్టారు. దాదాపు 8 గంటల పాటు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించానున్నారు. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం (Central Govt) భావిస్తుండగా.. విపక్షాలు (Oppositions) వ్యతిరేకిస్తున్నాయి.
ఈ సందర్భంగా లోక్సభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. “మేము సానుకూల సంస్కరణలను ప్రవేశపెడుతున్నప్పుడు, మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? బిల్లులో ప్రమేయం లేని వారిని తప్పుదారి పట్టించి, రెచ్చగొడుతున్నారు” అని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టకపోతే, పార్లమెంటు భవనం కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలాఉంటే వక్ఫ్ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందిన తర్వాత గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఉభయ సభల్లో అధికార ఎన్డీయేకు మెజారిటీ ఉన్నందున బిల్లు ఆమోదానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బీజేపీ భావిస్తోంది. వక్ఫ్ పాలకవర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేసేలా ఈ కొత్త బిల్లును కేంద్రం తీసుకొచ్చింది. ఈ మేరకు 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు జరిగాయి. అయితే, గతేడాది ఆగస్టులోనే కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. అప్పుడు దీనిపై విపక్షాల నుంచి తీవ్ర నిరసనలు రావడంతో జేపీసీ (JPC- Joint Parliamentary Committee) పరిశీలనకు ఈ బిల్లుని పంపింన సంగతి తెలిసిందే.