భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: కంచ గచ్చిబౌలి (Gachibowli)లోని భూవివాదంపై తెలంగాణ ప్రభుత్వ (Telangana Govt) తీరును సుప్రీంకోర్టు (Supreme court) తీవ్రంగా తప్పుబట్టింది. ఈ అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. గచ్చిబౌలి భూ వివాదం అంశంపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను కోర్టుకు పంపారు.
ఇక తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పరిశీలించిన జస్టిస్ గవాయ్ (Justice Gavai) నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి వార్త కథనాలను అమికస్ క్యూరీ కోర్టు ముందు ప్రస్తావించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రతివాదిగా చేర్చింది. అత్యవసరంగా ఈ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏమిటిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ భూమి అటవీ భూమి కాకపోయినా, చెట్లు తొలగించే ముందు కేంద్ర పర్యావరణ సంఘం (CEC) అనుమతి తీసుకున్నారా? అని నిలదీసింది.
ఒక్క రోజులో 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడం సాధారణ విషయం కాదని.. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది సుప్రీంకోర్టు. అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. కాగా అంతకు మందు ఉదయం ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు మధ్యాహ్నం 3.30 గంటలలోగా నివేదిక అందించాలని రాష్ట్ర హైకోర్టుకు ఆదేశించింది. ఇది అటవీ భూమి కాదని ఆధారాలు లేవు అని కోర్టులో వాదించారు. అయితే, ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వ చర్యలను నిలిపివేయాలంటూ మరోసారి ఆదేశాలు జారీ చేసింది.