భారత్ సమాచార్.నెట్, అమెరికా: అంచనాలను మించిపోయేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై భారీ సుంకాలు (Tariffs) విధిస్తూ వాణిజ్య యుద్ధానికి శంఖం పూరించారు. ఈ నిర్ణయంపై అనేక దేశాలు భిన్నభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయం గ్లోబల్ ఎకానమీ (Global Economy)పై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనల మధ్య.. ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. టారిఫ్లపై చర్చకు తాను సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు.
ఇతర దేశాలు అమెరికాపై విధిస్తున్న సుంకాలను బట్టి తాము టారిఫ్లు విధించినట్లు ట్రంప్ చెప్పారు. ఇది పూర్తిగా పరస్పర చర్యే అన్నారు. ఇప్పుడు ఈ సుంకాలు అమల్లోకి రాగానే.. చాలా దేశాలు అమెరికా తీర్పును పరిగణనలోకి తీసుకుని.. తమ గురించి ఆలోచించడం మొదలుపెట్టాయన్నారు. ఇది అమెరికా విజయానికి నిదర్శనమని.. ఈ నిర్ణయంతో అమెరికా మళ్లీ ప్రాధాన్యత పొందుతుందని పేర్కొన్నారు. ఇప్పుడు ఇందులోని చాలా దేశాలు తమకోసం ఏదైనా చేస్తామని ఆఫర్ చేస్తున్నాయన్నారు. అలా ఏ దేశమైనా ముందకొచ్చి మాకు ఆఫర్ ఇస్తే.. వారితో టారిఫ్లపై చర్చలు జరిపేందుకు సిద్ధమన్నారు.
అయితే ట్రంప్ ప్రకటన.. ట్రంప్ పాలనలోని ఇతర ప్రముఖుల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నాయి. సుంకాల విషయంలో ఏ దేశాలతోనూ తమ అధ్యక్షుడు ట్రంప్ డీల్ కుదుర్చుకునే అవకాశం లేదని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్, ట్రంప్ సన్నిహితుడు పీటర్ నవరో చెప్పారు. ఎలాంటి డీల్లను కుదుర్చుకునే అవకాశం లేదని ప్రకటించారు. ఇప్పుడే ట్రంప్ చర్చలకు ముందుకు రావడం కీలక పరిణామంగా మారింది. అమెరికాకు దిగుమతయ్యే ప్రతి వస్తువుపై కనీసం 10 శాతం నుంచి గరిష్ఠంగా 49 శాతం వరకు టారిఫ్లు అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
తమతో వాణిజ్య లావాదేవీలున్న దేశాలన్నింటిపైనా ట్రంప్ టారిఫ్లు విధించారు. భారత్పై 26 శాతం, చైనాపై 34 శాతం, యూరోపియన్ యూనియన్ దేశాలపై 20శాతం విధించింది. ఈ టారిఫ్లను రాయితీ సుంకాలుగా అభివర్ణించిన ట్రంప్, ఆయా దేశాలు తమపై విధిస్తున్న సుంకాలలో సగమే తాము విధిస్తున్నామని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో గ్లోబల్ వాణిజ్య రంగం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ట్రంప్ ఇచ్చిన చర్చల సంకేతాలపై తదుపరి వ్యవహారాలు ఎలా మలుపు తిరుగుతాయో చూడాలి మరి.