భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Central Govt) పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel)పై కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty)ని లీటర్కు రూ. 2 చొప్పున పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పెరిగిన ఈ ధరలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది కేంద్రం. అయితే, రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండబోదని.. పెంచిన ధరలు కంపెనీలే భరిస్తాయని, సామాన్యుడిమీద భారం పడదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి (Hardeep Singh Puri) స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రస్తుతం హైదరాబాద్లో 107.46 పైసలు ఉన్న పెట్రోలో పెంచిన ధరతో 109.46 పైసలు కానుంది. ఇక డీజిల్ ప్రస్తుతం 95.70 పైసలుండగా పెరిగిన ధరతో 97.70 పైసలు కానుంది. ఇక తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 108, 109 రూపాయలు కొనసాగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.109.42 ఉండగా.. ధరలు పెంపుతో రూ.111.42కు చేరనుంది. డీజిల్ ధర రూ.97.32 ఉండగా.. రెండు రూపాయలు పెంపుతో రూ.99.32కి చేరనుంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్లు విధిస్తున్న నేపథ్యంలో కేంద్ర రెవెన్యూ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని రూ. 50 చొప్పున పెంచింది. 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు హైదరాబాద్ నగరంలో రూ. 855 వద్ద ఉండగా.. రేపటి నుంచి (ఏప్రిల్ 8) ఇది రూ. 905 కు పెరగనుంది. విశాఖపట్నం రూ. 811, విజయవాడ రూ. 827, గుంటూరు రూ. 827 గా ఉన్నాయి. ఇకపోతే ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 803 ఉండగా.. రూ. 853కు పెరగనుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం వల్ల ఇతర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉందని బిజినెస్ నిపుణులు అంచనా వేశారు.