భారత్ సమాచార్.నెట్, బెంగళూరు: కర్ణాటక హోంమంత్రి (Karnataka Home Minister) జి. పరమేశ్వర (Parameshwara) వివాదాస్పద వ్యాఖ్యలు (Controversy Comments)చేశారు. ఇటీవల బెంగళూరు (Bengaluru)లో ఓ యువతిపై జరిగిన లైంగిక దాడి (Molestation) ఘటనపై స్పందిస్తూ.. “బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇటువంటి సంఘటనలు సాధారణమే” అని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారని.. దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులదని, ప్రజలు సంచరించే ప్రాంతాల్లో నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన తెలిపారు.
అయితే ఈ ఘటనపై మంత్రి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిర్లక్ష్యపూరితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు మహిళా సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు వేధింపులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని.. ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇకపోతే గత వారం (ఏప్రిల్ 3)న సుద్దగుంటెపాల్య ప్రాంతంలోని భారతి లేఅవుట్లో ఇద్దరు యువతులు రోడ్డు మీద నడుస్తుండగా, ఒక వ్యక్తి అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చి, వారిలో ఒకరిపై అసభ్యంగా ప్రవర్తించి అక్కడినుంచి పారిపోయాడు. ఊహించని ఈ సంఘటనతో యువతులు భయంతో ఆ ప్రాంతం విడిచి వెళ్లిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయకపోయినా,ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బెంగళూరు పోలీసులు స్వయంగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఇంతకుముందు కూడా బెంగళూరులో ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలున్నాయని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.