భారత్ సమాచార్.నెట్, చెన్నై: మహిళలను కించపరిచే విధంగా తమిళనాడు (TamilNadu) అటవీశాఖ మంత్రి (Minister for Forest) పొన్ముడి (Ponmudy) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పొన్ముడి వ్యాఖ్యలపై నటీ, బీజేపీ నాయకురాలు ఖష్బూ (Kushbu), సింగర్ చిన్మయి (Singer Chinmayi)తో పాటు ఆయన సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో.. అధికార డీఎంకే (DMK) పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగింది. దీంతో డీఎంకే అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. పొన్ముడిని మంత్రి పదవి నుంచి తొలగించింది.
ఇక వివరాల్లోకి వెళ్తే డీఎంకే సీనియర్ నేత, అటవీశాఖ మంత్రి అయిన పొన్ముడి ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేశ్యలకు, విటులకు మధ్య సంభాషణ ఎలా ఉంటుందన్న సంగతిని మంత్రి తీవ్రమైన అసభ్య పదజాలంతో వివరించారు. ఈ సందర్భంగా హిందూ తిలకాలను లైంగిక భంగిమలతో పోల్చారు. ఇందుకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆయన మాట్లాడిన తీరు మహిళలను అవమానించేలా ఉందని విమర్శలు వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
బీజేపీ నాయకురాలు, ప్రముఖ తమిళ నటి ఖుష్బూ సుందర్ మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ” మీ మంత్రి చేసిన వ్యాఖ్యలకు అర్థం నాకంటే మీకే బాగా తెలుసు. ఇలాంటి వ్యాఖ్యలు మీ ఇంట్లో మహిళలు అంగీకరిస్తారా ? అంటూ” సీఎం స్టాలిన్ను ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లని దేవుడే శిక్షిస్తాడని సింగర్ చిన్మయి మండిపడ్డారు. పొన్ముడిని మంత్రి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళి (Kanimozhi) సైతం మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. ”పొన్ముడి వ్యాఖ్యలు ఆమోదయోగ్యమైనవి కాదు. కారణం ఏదైన సరే.. మహిళలపై అతడు చేసిన అవమానకర వ్యాఖ్యలు ఖండించాల్సిందేనని” స్పష్టం చేశారు
చివరికీ పొన్ముడి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదవ్వడంతో ఆయన్ని డీఎంకే అధిష్ఠానం మంత్రి పదవిని తొలగించింది. అలగే పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవితో పాటు మిగతా పదవులు కూడా తొలగించింది. గతంలోనూ ఆయన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సు సౌకర్యం గురించి మాట్లాడుతూ మహిళలను వలసదారులతో పోల్చారు. ఈ వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్ర దుమారమే రేపాయి.