భారత్ సమాచార్.నెట్, కడప: ఒంటిమిట్ట (Vontimitta) శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం (Sitaramula Kalyanam) జరగనుంది. ఒంటిమిట్ట రామయ్య క్షేత్రం, కళ్యాణ వేదిక ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక స్వామివారి కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. కాగా, ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రానున్నారు.
మరోవైపు ఒంటమిట్ట సీతారామలక్ష్మణులకు పెన్నా సిమెంట్ అధినేత (Penna Cement Owner) ప్రతాప్ రెడ్డి (Pratap Reddy) కుటుంబ సభ్యులు స్వర్ణ కిరీటాలు బహుకరించారు (Crowns Donated). 7 కేజీల బంగారంతో 3 స్వర్ణ కిరీటాలు (Three Golden Crowns) తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. వీటి విలువ రూ.6 కోట్ల కోట్ల 60 లక్షలు ఉంటుందని దాతలు వెల్లడించారు. ఒంటిమిట్టలో స్వర్ణ కిరీటాలను అంతరాలయంలో స్వామి, అమ్మవార్ల దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం స్వర్ణ కిరీటాలను సీతారామలక్ష్మణులకు ఆలయ పండితులు అలంకరించారు. కిరీటాలు బహుకరించిన వారిని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు ఘనంగా సన్మానించారు.
ఇకపోతే స్వామివారి కళ్యాణ వేదిక ప్రాంగణంలోని 147 గ్యాలరీల్లో 60,000ల మంది స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. కల్యాణ వేదిక వద్ద తలంబ్రాల పంపిణీకి తొలిసారిగా 28 కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తలంబ్రాలు, కంకణం, లడ్డూ, అన్నప్రసాదాలు అందించనున్నారు. అదేవిధంగా షెడ్ల వద్ద చలివేంద్రం, పానకం, మజ్జిగ, కూలర్లు ఉండేలా చూస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడు తెలిపారు. ఆలయ సమీపంలో క్యూలైన్లలో వెళ్లే భక్తుల కోసం జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశామన్నారు. సీతారాముల కల్యాణోత్సవం వీక్షించేలా 23 ఎల్ఈడీ స్క్రీన్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.