భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మొక్కల ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత (Padma Shri Awardee) వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah) కన్నుమూశారు (Passes Away). గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నా రామయ్య ఈరోజు తెల్లవారుజామున గుండెపోటు (Heart Attack)తో మరణించారు. మొక్కుల ప్రేమికుడు రామయ్య ఆయన ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్నారు. ఆయన జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. వనజీవి రమయ్య తెలంగాణ (Telangana) వ్యక్తే. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా (Khammam) రెడ్డిపల్లి. రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారు.
వనజీవి రామయ్య అసలు పేరు దరిపల్లి రామయ్య (Daripalli Ramaiah). 2017లో కేంద్ర ప్రభుత్వం వనజీవి రామయ్యను పద్మశ్రీతో సత్కరించింది. చిన్నప్పటి నుండి ‘చెట్లను పెంచండి’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం నింపుతూ.. స్వయంగా కోటి మొక్కలు నాటుతూ పర్యావరణానికి విశేషమైన సేవ చేశారు రామయ్య. ప్రకృతికి చేసిన సేవ కారణంగా ఆయనకు వనజీవి అనే బిరుదు వచ్చింది. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య పర్యావరణ మార్పులను రామయ్య అనేవారు. దీనికి పరిష్కారం మొక్కలను, చెట్లను పెంచడమే అని చెప్పేవారు.
మరోవైపు వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ప్రకృతి పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి వనజీవిగా పేరుగాంచిన దరిపల్లి రామయ్య అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి మొత్తం సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి పద్మశ్రీ రామయ్య అని తెలిపారు. రామయ్య మరణం సమాజానికి తీరని లోటు అని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య ఆత్మకు నివాళిని సీఎం అర్పించారు. అలాగే రామయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు, మాజీ సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హరీష్ రావు పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.