భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ప్రవేశపెడుతున్న భూభారతి పోర్టల్ (Bhu- Bharathi) రేపటి నుంచి అందుబాటులోకి (Available From Tomorrow) రానుంది. ఏప్రిల్ 14న భూ భారతి పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ భూభారతి పోర్టల్ను తొలుత ఎంపిక చేసిన మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ భారతి పోర్టల్ను ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) నివాసంలో దీనిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భూభారతి పోర్టల్ను రేపు జాతికి అంకితం చేయబోతున్నట్లు తెలిపారు. సామాన్య రైతుకు కూడా అర్ధమయ్యేలా భూభారతిని రూపొందించినట్లు తెలిపారు. భూభారతి తాత్కాలికం కాదని.. కనీసం వంద సంవత్సరాల పాటు ఉంటుందన్నారు. భూభారతి వెబ్సైట్ సైతం అత్యాధునికంగా ఉండాలని తెలిపారు. భద్రతాపరమైన సమస్యలు రాకుండా పకడ్బందీగా ఉండాలని అధికారులకు సూచించారు.
అలాగే భూభారతి ప్రారంభోత్సవం అనంతరం రాష్ట్రంలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూ భారతిపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు సీఎం. పోర్టల్ బలోపేతానికి ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని కూడా సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. వెబ్ సైట్తో పాటు యాప్ను పటిష్టంగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు.