భారత్ సమాచార్.నెట్,బాంబే: పోక్సో కేసు (POCSO case)లో బాంబే హైకోర్టు (Bombay Highcourt) సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఉన్న నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ (Bail) మంజూరు చేసింది. 15 ఏళ్ల బాలిక (Minor Girl) తన చర్యల పరిణామాలను పూర్తిగా అర్థం చేసుకోగలదని కోర్టు పేర్కొంది. బాలిక ఇష్టప్రకారమే అతనితో వెళ్లిందని.. వారి శారీరక సంబంధం ఇద్దరి సమ్మతితోనే జరిగిందని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం కేసు వాస్తవాలు అమ్మాయికి తాను చేసే పని యొక్క పూర్తి ప్రాముఖ్యతను తెలుసుకునే తగినంత జ్ఞానం, సామర్థ్యం ఉందని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. యువకుడికి బెయిల్ మంజూరు చేసింది.
2020లో నవీ ముంబైకి చెందిన 15ఏళ్ల బాలిక యూపీకి చెందిన 22 ఏళ్ల యువకుడిని ప్రేమించి.. అతడితో వెళ్లిపోయింది. అనంతరం వారు కలిసి కొద్ది నెలలు జీవించారు. 10 నెలల తర్వాత మైనర్ బాలిక గర్భంతో ఇంటికి తిరిగి వచ్చింది. దీంతో బాలిక తండ్రి యువకుడిపై పోక్సో కేసు పెట్టాడు. తన కుమార్తెను మోసం చేశాడని పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద అతడిపై కేసు నమోదు కావడంతో గత కొంత కాలంగా అతడు జైల్లో ఉంటున్నాడు. దీంతో ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు పూర్తి సమాచారాన్ని కోర్టుకు అందించారు.
ఇక ఈ వ్యవహారమంతా జరిగిన సమయంలో బాలిక మైనర్ అని, ఆమె అంగీకారమనేదని అసలు పాయింటే కాదని బాలిక తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. తన ఇష్ట పూర్వకంగానే బాలిక ఆ యువకుడితో కలిసి వెళ్లినట్లు తన వాంగ్మూలాన్ని బట్టి స్పష్టంగా తెలుస్తోందని జస్టిస్ మిలింద్ జాదవ్ ధర్మాసనం పేర్కొంది. దీంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. ఇకపోతే దేశవ్యాప్తంగా పోక్సో కేసులు ఎక్కువయ్యాయి. ప్రేమ ముసుగులో కొందరు, కామంతో మరికొందరు మైనర్ బాలికలను తమ లైంగిక వాంఛను తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. అనంతరం మైనర్ బాలికలు గర్భం దాల్చడంతో కేసులు నమోదై కోర్టుల చుట్టు తిరుగుతున్నారు.