భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt ) గద్దర్ (Gaddar) అవార్డుల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. తాజాగా గద్దర్ అవార్డులన్ని (Gaddar Awards) జూన్ 14న ప్రధానం చేయనున్నట్లు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ప్రకటించారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో జరిగిన అవార్డుల కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
హెచ్ఐసీసీ (HICC) వేదికగా ఈ వేడుకను నిర్వహిస్తున్నట్టు వివరించారు. 14 ఏళ్ల విరామం తర్వాత ప్రభుత్వం ఈ అవార్డులను ప్రధానం చేస్తోందని దిల్ రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అవార్డులకు సినీ పరిశ్రమ నుంచి అపూర్వ స్పందన లభించిందని దిల్ రాజు హర్షం వ్యక్తం చేశారు. ఇక అవార్డుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా.. నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సినీ రంగ నిపుణులతో కూడిన జ్యూరీని ఏర్పాటు చేశారు. నామినేషన్లు నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులను కోరారు దిల్ రాజు.
ఇక అవార్డుల జ్యూరీకి ప్రముఖ సీనియర్ నటి జయసుధ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో కలిపి మొత్తం 1248 నామినేషన్లు అందాయి. అందులో వ్యక్తిగత విభాగంలో 1172, ఫీచర్ ఫిల్మ్స్, బాలల చిత్రాలు, డాక్యుమెంటరీలు, ఫిల్మ్ విమర్శలు, సినిమాలపై రచనలు వంటి విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.