భారత్ సమాచార్.నెట్: క్యాథలిక్ క్రైస్తవుల మతాధిపతి (Religious Head) పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis) ఏప్రిల్ 21 మరణించిన సంగతి తెలిసిందే. ఆయన స్ట్రోక్కు గురవడమేగాక, గుండె సంబంధిత సమస్యలు కూడా తలెత్తడం వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు వాటికన్లోని వైద్య నిపుణులు (Vatican Doctors) వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించారు. ఆయనకు నివాళులర్పించేందుకు ప్రజలకు అవకాశం ఇవ్వనున్నారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు రేపు ఉదయం 10 గంటలకు జరగనున్నాయి.
అయితే పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) శుక్రవారం వాటికన్ సిటీకి బయల్దేరి వెళ్లారు. ఆమె వెంట కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలతో కూడిన భారత ప్రతినిధి బృందం వాటికన్కు పయనమైంది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ఆమె వాటికన్లో పర్యటిస్తారు. భారత ప్రభుత్వం, ప్రజల తరఫున పోప్ ఫ్రాన్సిస్కు నివాళులర్పించి, సంతాపం తెలియజేస్తారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ యువరాజు విలియం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సహా పలు దేశాల అధినేతలు, రాజులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు వాటికన్ వర్గాలు తెలిపాయి. సుమారు 130 దేశాల ప్రతినిధులు పాల్గొనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే పోప్ ఫ్రాన్సిస్ మృతి నేపథ్యంలో వాటికన్ సిటి నగరంలో తొమ్మిది రోజుల పాటు అధికారిక సంతాప కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ సంతాప దినాలు ముగిశాక.. కొత్త పోప్ ఎంపిక ప్రారంభమవుతోంది.ఈ ప్రక్రియను “కాంక్లేవ్”గా వ్యవహరిస్తారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన కార్డినల్స్ పాల్గొని తదుపరి పోప్ను ఎన్నుకుంటారు.