భారత్ సమాచార్.నెట్: భారత్ సుప్రీంకోర్టు (Supreme Court of India) 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ (BR Gavai) నియమితులయ్యారు. మే 14న బీ ఆర్ గవాయ్ సీజేఐ (CJI)గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సీజేఐగా ఉన్న సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) మే 13న పదవీ విరమణ చేయనున్నారు. బీఆర్ గవాయ్ని సీజేఐ స్థానానికి ఇటీవల కొలిజీయం సిఫారుసు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రధాన న్యాయమూర్తి గవాయి.. ఛీఫ్ జస్టిస్గా కేవలం ఆరు నెలలు మాత్రమే కొనసాగనున్నారు. ఈ ఏడాది నవంబర్లో ఆయన పదవి విరమణ చేయనున్నారు.
తాజాగా ఈయన నియామకాన్ని రాష్ట్రపతి ద్రైపది ముర్ము ఆమోదించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రకటించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ నియామకం భారత న్యాయవ్యవస్థకు కీలక అడుగు. న్యాయ రంగంలో ఆయన తన శ్రేష్ఠత, నిష్పాక్షికతకు ప్రసిద్ధి చెందారు అని మేఘ్వాల్ అన్నారు. జస్టిస్ గవాయి సుప్రీంకోర్టులో ఎన్నో ముఖ్యమైన కేసులకు తీర్పులను ఇచ్చారు. ఇకపోతే జస్టిస్ గవాయ్ మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. షెడ్యూల్డ్ కులాలకు చెందిన దేశంలోని రెండవ ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ ఘనత సాధించారు.
బీఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతిలో నవంబర్ 24, 1960న జన్మించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, బీహార్, కేరళ మాజీ గవర్నర్ దివంగత ఆర్ఎస్ గవాయ్ కుమారుడే గవాయ్. 1985లో బీఆర్ గవాయ్ న్యాయవాది వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్ జనరల్ బారిస్టర్ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ ముంబై హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్ చేశారు. 1992లో నాగపూర్ బెంచ్ అసిస్టెంట్ గవర్నమెంట్ లాయర్గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియామకమయ్యారు.
జస్టిస్ గవాయ్ 2003లో బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. నవంబర్ 12, 2005న శాశ్వత న్యాయమూర్తి గవాయ్ నియమితులయ్యారు. జస్టిస్ గవాయ్ ముంబై, నాగ్పూర్, ఔరంగాబాద్, పనాజీలలో బెంచ్లకు నాయకత్వం వహిస్తూ 15 సంవత్సరాలకు పైగా సేవలందించారు. 2016లో నోట్ల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన బెంచ్లో బీఆర్ గవాయ్ సైతం ఉన్నారు. ఇవే కాకుండా బుల్డోజర్, ఎలక్ట్రోరల్ బాండ్లకు సంబంధించిన తీర్పులు వెలువరించిన ధర్మాసనంలోనూ గవాయ్ ఉన్నారు.