భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) నేపథ్యంలో భారతదేశం (India)-పాకిస్థాన్ (Pakistan) మధ్య సంబంధాలు మరింత ఉద్రిక్తతలకు దారీ తీస్తున్నాయి. పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్ (TRF)’ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి, 26 మంది పౌరులను పొట్టన పెట్టుకుంది. ఈ దారుణ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఉగ్రవాదులపై తీవ్రంగా స్పందిస్తూ, వారి వెనుక ఉన్న ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజాగా భారత్-పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. ప్రధాని మోదీ మరోసారి ఉగ్రవాదులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అంగోలా అధ్యక్షుడు జోవో మాన్యుయెల్ గొన్కాల్వ్స్ లౌరెంకోతో కలసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులపై.. ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.
పహల్గామ్ దాడి నేపథ్యంలో సీమాంతర ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరాటానికి అంగోలా మద్దతునివ్వడంతో.. ఆ దేశానికి కృతజ్ఞతలు తెలియజేశారు ప్రధాని మోదీ. ఇరు దేశాలు దాదాపు 40 ఏళ్లుగా భాగస్వామ్యంలో కలిసి ముందుకు నడుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంగోలా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఇండియా నమ్మకంతోనూ, స్నేహంతోను అండగా నిలిచిందని.. ఆఫ్రికన్ దేశాల నుంచి గత పది సంవత్సరాలు తమకు ఎంతో సహకారం అందిందని ప్రధాని మోదీ తెలిపారు.