భారత్ సమాచార్.నెట్: ప్రముఖ యోగా గురువు (Yoga Guru), పద్మశ్రీ అవార్డు (Padma Shri Awardee) గ్రహీత స్వామి శివానంద (Swami Sivananda) (128) కన్నుమూశారు. వారణాసిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. స్వామి శివానంద మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. యోగా రంగానికి, ఆధ్యాత్మికతకు ఆయన చేసిన అపూర్వ సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. ప్రతీ తరానికి ఆయన స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు. ఆయన మృతి యోగా ప్రపంచానికి తీరని లోటన్నారు.
శివానంద 1896, ఆగస్టు 8న అప్పటి అవిభాజ్య భారతదేశంలోని సిల్హెత్ జిల్లా (ఇప్పటి బంగ్లాదేశ్)లోని ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఆయన ఆరేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో ఆయన పశ్చిమ బెంగాల్లోని ఓ ఆశ్రమంలో పెరిగారు. అక్కడ గురువు ఓంకారానంద గోస్వామి ఆయన పెంచి పెద్ద చేయడమేగాక.. శిష్యునిగా స్వీకరించి, శివానందకు యోగా, ఆధ్యాత్మికత విషయాలను బోధించారు. అనంతరం ఆయన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేశారు. 50 ఏళ్లుగా స్వామి శివానంద పూరీలో 400-600 కుష్టురోగులకు అంకితభావంతో సేవలు అందించారు.
యోగా, ఆధ్యాత్మిక సేవల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా శివానందను భారత్ ప్రభుత్వం 2022లో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఆయన తెల్లటి ధోవతి, కుర్తా ధరించి, పాదరక్షలు లేకుండా, అతి సాదాసీదాగా వచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. కాగా స్వామి శివానంద గత 100 ఏండ్లుగా కుంభమేళాకు హాజరయ్యారు. ప్రయాగ్ రాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్లో జరిగే ప్రతి కుంభమేళాలో ఆయన పాల్గొన్నట్లు ఆయన శిష్యుడు సంజయ్ సర్వజన తెలిపారు.