భారత్ సమాచార్.నెట్: ఉగ్రమూకల కుట్ర(Terrorist groups)ను నిఘా వర్గాలు (Intelligence Agencies) పసిగట్టాయి. జమ్ముకశ్మీర్(Jammu Kashmir)లో మరోభారీ ఉగ్రదాడి (Terror attack) జరిగే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు భద్రతా బలగాలను అప్రమత్తం చేశాయి. ఈసారి ముష్కరులు జైళ్లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిసింది. జమ్ముకశ్మీర్ జైళ్లలో ఉన్న ఉగ్రనాయకులను విడిపించేందుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని ఇతర జైళ్ల వద్ద భారీ భద్రత కల్పించారు.
పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఉగ్రమూకలకు సహకారం అందించే వర్కర్లను, స్లీపర్ సెల్స్ను అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. అలాగే సైనిక వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను ఇప్పటికి ఎన్ఐఏ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు సమాచారం అందడంతో.. జైళ్ల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. జమ్ము కాశ్మీర్ జైళ్లకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ కల్పిస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ కవింపు చర్యలకు పాల్పడుతోంది. పహల్గాం దాడి తర్వాత మే 4-5 అర్ధరాత్రి కూడా కాల్పులకు దిగింది పాక్. పలు చెక్పోస్టుల వద్ద చిన్న ఆయుధాలతో పాక్ రేంజర్లు కాల్పులు జరిపినట్లు భారత సైన్యం తెలిపింది. కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరి, నౌషెరా, సుందర్భని, అఖ్నూర్ సెక్టార్లలో కాల్పులు జరిగాయని వెల్లడించింది. పాక్ రేంజర్ల కాల్పులకు తగిన రీతిలో భారత్ బదులిచ్చినట్లు సైనిక వర్గాలు తెలిపాయి.