భారత్ సమాచార్.నెట్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror attack) కారణంగా భారత్ (India), పాక్ (Pakistan) మధ్య పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయి. ఈ క్షణంలో అయిన యుద్ధం (War) జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) కీలక నిర్ణయం తీసుకుంది. శత్రు దేశాల నుండి దాడులు జరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని.. ప్రజలు తమను తాము రక్షించుకునే విధానాలపై అవగాహన కల్పించేందుకు రేపు అంటే మే 7న దేశవ్యాప్తంగా సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
పాక్ ప్రతిదాడికి దిగితే.. తమను తాము ఎలా రక్షించుకోవాలని పౌరులకు అవగాహన కల్పించనుంది. అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలో పౌరులకు తెలపాలని నిర్దేశించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలను.. వాటి రిహార్సల్ జరపాలని సూచించింది. ఎయిర్ రైడ్ హెచ్చరిక సైరెన్ల పనితీరును పరీక్షించాలని కూడా కేంద్రం ఆదేశించింది. కాగా దేశంలో సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. 1971లో భారత్ పాక్ యుద్దం జరిగే ముందు.. బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ చర్యలు చేపట్టిన సమయంలో అప్పటి ప్రభుత్వం కూడా దేశ ప్రజల రక్షణ కోసం ఇలాంటి మాక్ డ్రిల్స్ను నిర్వహించింది.
ఇదిలా ఉంటే దేశంలోని దాడులకు అత్యధిక అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించింది కేంద్రం. కేటగిరీ-1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రాన్ని చేర్చారు, ఎందుకంటే ఇక్కడ ప్రధాని నివాసంతో పాటు త్రివిధ దళాల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. కేటగిరీ-2లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం నగరాలు ఉన్నాయి. మొత్తం 244 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే కశ్మీర్, గుజరాత్, హర్యానా, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాంతాల్లో డ్రిల్స్ జరగనున్నాయి.