భారత్ సమాచార్.నెట్: సీజేఐ (CJI)గా పదవీ విరమణ (After Retirement) అనంతరం ఎలాంటి అధికారిక పదవులను స్వీకరించబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా (Sanjiv Khanna) వెల్లడించారు. న్యాయవ్యవస్థలోనే ఏదైనా చేయాలనుకుంటున్నానని చెప్పారు. మంగళవారం పదవీ విరమణ బెంచ్ కార్యక్రమాలు ముగిసిన అనంతరం కోర్టు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తదుపరి సీజేఐగా బాధ్యతులు చేపడుతున్న బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు విలువలను కాపాడుతారని తాను ఖచ్చితంగా నమ్ముతున్నానని.. ఆయన గొప్ప న్యాయమూర్తి అని పేర్కొన్నారు.
అలాగే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇది వీడ్కోలు కాదు.. ఒక దశ నుంచి మరో దశలోకి ప్రారంభం మాత్రమేనని అన్నారు. ఇన్నాళ్లూ ఎన్నో నేర్చుకున్న.. సహచర జడ్జిలు, న్యాయవాదులు ఎంతో సహకారం అందించారని.. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో జ్ఞాపకాలను వెంట తీసుకెళ్తున్నాను.. అవి కలకాలం పదిలంగా ఉంటాయని భావోద్వేగానికి గురయ్యారు. కాగా భారత్ 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గతేడాది నవంబర్ 11న బాధ్యతలు చేపట్టారు.
ఢిల్లీలోని ప్రముఖ కుటుంబానికి చెందిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నాకు సమీప బంధువు. 1960 మే 14న జన్మించిన సంజీవ్ ఖన్నా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన సంజీవ్ ఖన్నా ఆ మరుసటి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, 2024 నవంబర్ 11న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.