భారత్ సమాచార్.నెట్, కర్నూలు: ఏపీ (Andhrapradesh) ప్రభుత్వం మహిళలకు (Women) గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజల కోసం మరో పథకాన్ని అందుబాటులోకి తేనుంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో (Super Six Schemes) భాగంగా మహిళలకు ఆగష్టు 15 నుంచి ఉచిత బస్సు (Fress Bus) ప్రయాణ సదుపాయం కల్పించనుంది. కర్నూలు (Kurnool)లో ఏర్పాటు చేసిన స్వర్ణాధ్రం-స్వచ్ఛాంధ్ర (Swarnandhra- Swachhandhra) కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రకటించారు.
ఏడాదిలో లక్ష మంది డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తానని సీఎం హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛాంధ్ర పాటించాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. పొడి చెత్త నుంచి విద్యుత్ తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గుంటూరులో 16 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు పనిచేస్తోందని త్వరలో రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, కడపలో అందుబాటులోకి వస్తాయన్నారు.
అలాగే దేశంలో అత్యధికంగా పింఛన్ అందిస్తున్న రాష్ట్రం ఏపీనే అని తెలిపారు. అలాగే అన్న క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించామని పేర్కొన్నారు. ‘దీపం-2’ పథకం కింద ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నామని.. డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. పాఠశాలలు తెరచేలోగా ఉపాధ్యాయ నియామకం పూర్తవుతుందన్నారు. మహిళల సంక్షేమానికి, విద్యారంగ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.