భారత్ సమాచార్.నెట్: ఉత్తరాఖండ్ (Uttarakhand)లో కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. కైలాస్ మానస సరోవర్ యాత్రా (Kailash Mansarovar Yatra) మార్గంలో పితోరాగఢ్ (Pithoragarh) జిల్లా సమీపంలో కొండ చరియలు (Landslides) విరిగి పడటంతో వందలాది యాత్రికులు (Pilgrims Stranded) చిక్కుకుపోయారు. కైలాస్ యాత్ర ప్రధాన మార్గంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో ఆ మార్గం పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఇరువైపులా యాత్రికులతోపాటు స్థానికులు వందలాది మంది చిక్కుకున్నారు.
మరోవైపు సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పర్వత ప్రాంతం కావడంతో విరిగిపడిన కొండ చరియలను తొలగించేందుకు ఆలస్యమవుతోంది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది కొండ చరియలు తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొండ చరియలు పూర్తిగా తొలగించే వరకు యాత్రీకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కొండ చరియలు తొలగించే వరకు యాత్రికులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్థానిక అధికారులు ఆహారం, నీరు వంటి అవసరాలను అందజేస్తూ పరిస్థితిని చక్కబెడుతున్నారు. పర్వత మార్గాలలో ఇలాంటి అకస్మాత్తు ఘటనలు జరగడం సహజమే అయినా.. ఈ స్థాయిలో రహదారి పూర్తిగా దెబ్బతినడం వల్ల యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా, కరోనా కారణంగా 2020లో కైలాస్ యాత్ర నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత చైనాతో ఘర్షణల కారణంగా ఐదేళ్లుగా యాత్రీకులను అనుమతించడం లేదు.