భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ (Telangana)లో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీ.సీ. ఘోష్ (Justice PC Ghose Commission) నేతృత్వంలోని కమిషన్ మరో కీలక అడుగు వేసింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish rao), బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender)కు కమిషన్ నోటీసులు(Notices) జారీ చేసింది. ఆ నోటీసుల్లో జూన్ 5న కేసీఆర్, 6న హరీశ్రావు, 9న ఈటల రాజేందర్ విచారణకు రావాలని ఆదేశిస్తూ.. తాము పంపించిన నోటీసులను 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం ఈ నోటీసుల అంశం చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో హరీశ్ రావు నీటి పారుదల శాఖ మంత్రిగా, ఈటల రాజేందర్ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. వీరు ముగ్గురు కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించిన ముఖ్య నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, పైర్స్ కుంగిపోవడం, లీకేజీలు వంటి సమస్యలపై కమిషన్ విచారణ దృష్టి సారించింది.
బీఆర్ఎస్ హయాంలో నిర్మితమైన ఈ ప్రాజెక్టులో భారీగా నిధులు ఖర్చయ్యాయి. అయితే, మేడిగడ్డ బ్యారేజీలో 2023 అక్టోబర్లో నిర్మాణ లోపాలు బయటపడ్డాయి. దాంతో ఇతర బ్యారేజీలలో కూడా సమస్యలు కనిపించాయి. ఈ కారణంగానే.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టు ఊసే ఎత్తకుండా సైలెంట్ అయ్యింది. అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రాజెక్టుల్లో సమస్యలపై సమగ్ర విచారణకు జస్టిస్ పీ.సీ. ఘోష్ నేతృత్వంలో కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ తాజాగా వీరికి నోటీసులు ఇచ్చింది.