భారత్ సమాచార్.నెట్: ప్రముఖ కన్నడ (Kannada) రచయిత్రి (Writer) బాను ముస్తాక్ (Banu Mushtaq) ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ (Booker Prize) 2025ను గెలుచుకున్నారు. ‘హార్ట్ ల్యాంప్’ (Heart Lamp) అనే చిన్న కథల (Short Story) సంకలనానికి గాను ఆమెను ఈ అవార్డు వరించింది. షార్ట్ స్టోరీ కలెక్షన్కు బుకర్ ప్రైజ్ దక్కడం ఇదే తొలిసారి. అంతే కాదు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు (Prestigious prize)ను అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా (First Kannada Writer ) బాను రికార్డ్ సృష్టించారు. లండన్లోని టేట్ మోడరన్లో జరిగిన కార్యక్రమంలో భారతీయ ట్రాన్స్లేటర్ దీపా భస్తితో పాటు బాను ముస్తాక్ ఈ అవార్డును అందుకున్నారు.
ముస్లిం కుటుంబంలో జన్మించిన బాను పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సమయంలో తొలిసారిగా ఓ షార్ట్ స్టోరీ రాశారు. అయితే 26 ఏళ్ల వయసులో తన కథ పేపర్ లో ప్రచురితమైంది. దాంతో ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది. తన తండ్రి ప్రోత్సాహంతో చదువులో రాణించిన ఆమె.. కన్నడ భాషపై మంచి పట్టు సాధించారు. ఆమె కేవలం రచయిత్రిగానే కాకుండా రిపోర్టర్గా, లాయర్గా వృత్తి జీవితాన్ని కొనసాగించారు. అంతేకాదు ఆమె మహిళల హక్కుల కోసం కూడా గళమెత్తారు. మతం, సమాజం మహిళలపై విధించే ఆంక్షలను.. ఆపాదించే నియమాలను ఆమె కథల ద్వారా ప్రశ్నించారు.
ఇకపోతే హార్ట్ ల్యాంప్ అనేది 12 చిన్న కథల పుస్తకం. ఈ కథల్ని ఆమె 30 ఏళ్లలో రాశారు. ఈ కథలు మహిళల గురించి అని.. వారిపై జరిగే క్రూరత్వం గురించి అని బాను ముస్తాక్ చెప్పారు. బుకర్ ప్రైజ్ అవార్డుతో పాటు 50 వేల పౌండ్ల నగదును వీరు బహుమతిగా అందుకున్నారు. కాగా, అంతర్జాతీయ బుకర్ బహుమతిని ప్రతి ఏడాది ప్రధానం చేస్తారు. గీతాంజలి శ్రీ, అనువాదకురాలు డైసీ రాక్వెల్ 2022లో ‘టూంబ్ ఆఫ్ సాండ్’కు అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత అంటే మూడు ఏళ్ల తర్వాత బుకర్ ప్రైజ్ గెలిచిన రెండవ భారతీయ పుస్తకం ఇది.