Homebreaking updates newsTamil nadu: కేంద్రం తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్టాలిన్ ప్రభుత్వం

Tamil nadu: కేంద్రం తీరుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్టాలిన్ ప్రభుత్వం

భారత్ సమాచార్.నెట్, చెన్నై: కేంద్రం (Central Govt), తమిళనాడు (TamilNadu Govt) ప్రభుత్వాల మధ్య మళ్లీ వివాదం తలెత్తింది. కేంద్రం తీరుపై స్టాలిన్ ప్రభుత్వం (Stalin Govt) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జాతీయ విద్యావిధానం (National Education Policy) అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య గత కొంతకాలంగా యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే జాతీయ విద్యావిధానం అమలు చేయడం లేదన్న కారణంతో మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులు నిలిపివేసిందని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఎన్ఈపీ అమలు చేయడం లేదన్న కారణంతో కేంద్రం తమ రాష్ట్రానికి రావాల్సిన రూ.2,151 కోట్ల నిధులను నిలిపివేసిందని పిటిషన్‌లో పేర్కొంది. అంతే కాదు పాఠశాల విద్య కోసం ఉద్దేశించిన సమగ్ర శిక్ష పథకం అవసరాలకు అనుగుణంగా తమిళనాడు ఉందని గతేడాది ఫిబ్రవరి 16న జరిగిన ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు సమావేశంలో కేంద్రం సంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించింది. ఆ తర్వాత ఈ పథకం కింద ఖర్చు కోసం రూ.3,585.99 కోట్ల నిధుల కేటాయింపు జరిగిందని పేర్కొంది.

ఇందులో 60:40 నిష్పత్తి ప్రకారం, కేంద్రం వాటా రూ.2,151 కోట్లు అని తెలిపింది. ఈ నిధులు గత ఏడాది ఏప్రిల్ 1 నుంచే రాష్ట్రానికి చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అయితే ఈ మొత్తంలో ఒక్క వాయిదా కూడా కేంద్రం విడుదల చేయలేదని స్టాలిన్ ప్రభుత్వం ఆరోపించింది. కాగా కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్‌ ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. భారతీయ భాషల పునరుద్ధరణకే త్రిభాషా సూత్రమని కేంద్రం చెబుతోంది. ఈ సూత్రం ప్రకారం, విద్యార్థులు ఇంగ్లిష్ మరియు ప్రాంతీయ భాషతో పాటు మూడో భాషను కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments