భారత్ సమాచార్.నెట్: ఉగ్రవాదాన్ని (Terrorism) పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ (Pakistan)పై ఐక్యరాజ్య సమితి (UN) వేదికగా భారత్ (India) మండిపడింది. సింధు జలాల ఒప్పందంపై పాక్ చేసిన ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. భారత్పై వేలాది ఉగ్రదాడులు చేయడమే కాకుండా 20,000 మందిని పొట్టనపెట్టుకుందని, తద్వారా మూడు యుద్ధాలకు పాకిస్థాన్ కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్లోని పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోందని మండిపడింది.
ఐక్యరాజ్యసమితిలో పౌరుల భద్రతపై జరిగిన చర్చలో పాక్ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ సింధు జలాల ఒప్పందం ఉపసంహరణ అంశాన్ని లేవనెత్తారు. నీరు జీవనానికి ఆధారం.. యుద్ధానికి కాదంటూ వ్యాఖ్యలు చేయడంతో ఐక్యరాజ్యసమితి భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు. 65 ఏళ్ల క్రితం భారత్ చిత్తశుద్ధితో పాక్తో సింధు జలాల ఒప్పందం కుదుర్చుకుందని, ఆరున్నర దశాబ్దాల్లో పాకిస్థాన్ మూడు యుద్ధాలు చేసి ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్నారు.
అంతేకాకుండా పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంత వరకూ సింధూ జలాల ఒప్పంద రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. రక్షణ కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ ఐకర్యరాజ్యసమితి వేదికగా డిమాండ్ చేశారు.