Homebreaking updates newsRBI: వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ 

RBI: వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ 

భారత్ సమాచార్.నెట్: ఆర్బీఐ (RBI) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ ముచ్చటగా మూడోసారి కీలక వడ్డీ రేట్ల (Interest Rates)ను సవరించింది. ఈసారి రెపో రేటు (Repo rate)ను ఏకంగా 50 బేసిస్ పాయింట్ల తగ్గించింది. దీంతో రుణ వడ్డీ రేట్లు ఒక్కసారిగా దిగిరానున్నాయి. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) శుక్రవారం వెల్లడించారు. రెపో రేటు అర శాతం కోత పెట్టిన క్రమంలో ప్రస్తుతం ఉన్న 6 శాతం నుంచి 5.50 శాతానికి దిగొచ్చింది.

ఈ ఏడాదిలో వడ్డీ రేట్లను సవరించడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లో కూడా కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు ఒక్కసారే ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రెపో రేటు చాలా కాలం తర్వాత 6 శాతం దిగువకు చేరుకుంది. ఇప్పటికే చాలా బ్యాంకులు రుణ వడ్డీ రేట్లను తగ్గించిన సంగతి తెలిసిందే. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో మరోసారి రుణ, డిపాజిట్ల వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి.
దాంతోపాటు, మార్కెట్‌లో ద్రవ్య లభ్యత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇంకా, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటును 5.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటును 5.75 శాతంగా స్థిరపరిచినట్టు గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ విధానాన్ని సర్దుబాటు నుండి స్థిర వైఖరికి మార్చుకోవాలని నిర్ణయించిందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్న.. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా మరియు స్థిరంగా అభివృద్ధి చెందుతోందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధి వేగంగా పెరుగుతోందని.. పెట్టుబడిదారులకు విస్తృత అవకాశాలు అందిస్తోందన్నారు. కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు సుమారు 6.5 శాతంగా ఉండే అవకాశముంది. ఆ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో 6.5 శాతం, రెండో త్రైమాసికంలో 6.7 శాతం జీడీపీ వృద్ధి సాధ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు. మూడో, నాల్గో త్రైమాసికాల్లో వరుసగా 6.6 శాతం, 6.4 శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చు.
RELATED ARTICLES

Most Popular