భారత్ సమాచార్.నెట్: గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad) గురువారం జరిగిన విమాన ప్రమాదం (Plane crash) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే బీజే మెడికల్ కాలేజీ (BJ Medical College) హాస్టల్ భవనం (Hostel Building)పై కూలింది. ఈ ఘోర ప్రమాదం నుంచి ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడగా మిగిలిన వారు అంతా మరణించారు. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని దు:ఖాన్ని నింపింది. ఈ విమాన ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కలిచివేసింది. ఈ ప్రమాదంలో 169 మంది భారతీయులు, 53 మంది యూకే జాతీయులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఓ కెనడియన్ మరణించారు.
ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు టాటా గ్రూప్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్గ్రేషియాగా అందించనున్నట్టు సంస్థ వెల్లడించింది. అంతే కాదు ప్రమాదంలో గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చులను పూర్తిగా టాటా గ్రూప్ భరించనున్నట్లు తెలిపింది. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఈ మేరకు అధికారికి ప్రకటన విడుదల చేశారు. ‘ఈ విమాన ప్రమాదం మమ్మల్ని కలచివేసింది. మేము అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని తెలిపారు.
ఇక ఈ ఘటనపై ఎయిరిండియా ఎండీ, సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్యాంప్బెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి శుక్రవారం ఉదయం వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. కాగా, ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికుల కుటుంబాల కోసం ఎయిరిండియా ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించింది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, గాట్విక్ విమానాశ్రయాలలో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.