భారత్ సమాచార్.నెట్: జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని పర్యాటక ప్రదేశాలు (Tourists Places) పర్యాటకుల (Tourists) తాకిడితో కళకళలాడుతున్నాయి. దాదాపు రెండు నెలల తర్వాత అక్కడా పర్యాటకుల సందడి నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అక్కడి పర్యాటక ప్రదేశాలన్నీ.. భద్రతా కారణాల వల్ల అక్కడి ప్రభుత్వం మూసివేసిన సంగతి తెలిసిందే. మూసివున్న పర్యాటక కేంద్రాలను దశలవారీగా తెరవనున్నట్లు ప్రకటించిన సర్కార్ తాజాగా పర్యాటక ప్రదేశాలను మళ్లీ తెరిచింది. ఈ నేపథ్యంలోనే సందర్శకులు తాకిడి పెరిగింది.
పహల్గామ్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ కనిపిస్తోంది. రహదారులపై వాహనాలు తిరుగుతున్నాయి. మార్గమధ్యంలో ప్రజలు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. పహల్గాంతో సహా చుట్టు పక్కల ప్రాంతాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకుల రద్దీతో పలు చోట్ల వాహనాల రద్దీ ఏర్పడింది. పర్యాటకుల రద్దీతో జమ్మూ కశ్మీర్ అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. పహల్గామ్ లోయలోని పలుచోట్ల భద్రతా దళాలను మోహరించింది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూకశ్మీర్కు పర్యాటకుల కరువు అయ్యారు. పర్యాటకులు లేక అక్కడి పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. టూరిజంపై ఆధారపడి జీవిస్తున్న వారిపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. జమ్మూ-కశ్మీర్లో ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా.. ఎప్పుడూ పర్యాటకులతో రద్దీగా ఉండేది. అక్కడి స్థానికులు దాదాపు టూరిజం మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత అక్కడ పరిస్థితులు మారిపోయాయి. కాగా, గతంలో మాదిరిగా ప్రస్తుతం పర్యాటకులు ఇక్కడకి రావడంలేదని స్థానికులు చెబుతున్నారు.