భారత్ సమాచార్.నెట్: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో (Main Role) రూపొందిన చిత్రం ‘కన్నప్ప’ (Kannappa). శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మాణంలో ఈ పాన్ ఇండియా మూవీ రూపొందింది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, మధుబాల వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో భాగమయ్యారు. విడుదలకు ముందే ఈ చిత్రం సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజినీకాంత్ (Superstar Rajinikanth) తాజాగా వీక్షించి చిత్ర బృందాన్ని అభినందనించారు.
ఈ విషయాన్ని మంచు విష్ణు ఇవాళ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘కన్నప్ప’ సినిమాని రజనీకాంత్ వీక్షించారని తెలుపుతూ.. ఆయనతో కలిసి దిగిన పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ”రజనీకాంత్ అంకుల్ నిన్న రాత్రి ‘కన్నప్ప’ మూవీ చూశారు. సినిమా చూసిన తర్వాత ఆయన నన్ను గట్టిగా హగ్ చేసుకున్నారు. ‘కన్నప్ప’ తనకు ఎంతగానో నచ్చిందని నాతో చెప్పారు. ఒక నటుడిగా ఈ హగ్ కోసం నేను 22 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాను. ఈ రోజు నేను ఎంతో సంతోషంగా ఉన్నా. ‘కన్నప్ప’ ఈ నెల 27న వస్తోంది. ఆ పరమశివుడి మాయాజాలాన్ని మీ అందరికీ చూపించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. హర హర మహాదేవ్” అని మంచు విష్ణు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.
ఇదిలా ఉంటే.. మంచు విష్ణు కన్నప్ప సినిమా విడుదలకు ముందే ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సినిమాలో బ్రహ్మణులను అవమానపరిచేలా సీన్లు ఉన్నాయని ఆ వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సినిమాలోని 13 సీన్లు తొలగించే అవకాశం కనపడుతోంది. జూన్ 27న రిలీజ్ చేయాలనుకున్న సినిమా ఆ రోజు చేస్తారా? లేదా మళ్లీ వాయిదా పడుతుందా? అనే సందేహం నెలకొంది. సినిమాలో ఉన్న 13 సీన్లు సమాజంలో అనవసరమైన దృక్పథాలను ప్రదర్శిస్తున్నాయని బ్రహ్మణచైతన్య వేదిక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో సెన్సార్ బోర్డు జోక్యం చేసుకుంది.