భారత్ సమాచార్.నెట్: గుజరాత్ (Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో వందలాది మంది తమ ప్రాణాలను కోల్పోయారు. అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన బోయింగ్ డ్రీమ్లైనర్కు చెందిన విమానం టేకాఫ్ అయిన నిమిషాల్లోనే బీజే మెడికల్ కాలేజ్ బిల్డింగ్ను ఢీ కొట్టి కూలిపోయింది. విమాన ప్రమాదం జరగడంతో ప్రమాద ప్రాంతంలో ప్రయాణికుల లగేజ్, విమాన శిథిలాలు చెల్లా చెదురుగా ఉండడంతో వాటిని తొలగిస్తున్నారు.
అయితే ఈ క్రమంలోనే ఘటనాస్థలి వద్ద పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు లభ్యమయ్యాయి. సమాచారం ప్రకారం.. అక్కడి నుంచి దాదాపు 70 నుండి 80 తులాల బంగారు ఆభరణాలు (సుమారు 800 గ్రాములు),రూ.80,000 నగదు, కొన్ని పాస్పోర్టులు.. అలాగే ఒక భగవద్గీత పుస్తకం లభించాయి. ఇలాంటి విషాద పరిస్థితుల మధ్య అటువంటి విలువైన వస్తువులు లభించడాన్ని చూసి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు. విమాన శిథిలాల వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఈ వస్తువులను పోలీసులకు అప్పగించారు.
ఇదిలా ఉంటే.. ఈ దుర్ఘటనలో మృతదేహాలు గుర్తించలేనంత తీవ్రంగా కాలిపోవడంతో ఎముకల్లోని కణజాలాన్ని సేకరించి డీఎన్ఏ పరీక్షలు చేయాల్సి వస్తున్నదని.. అందుకే మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతున్నదని వైద్యులు చెబుతున్నారు. డీఎన్ఏ పరీక్షలతో గుర్తించిన మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగిస్తున్నారు. కాగా ఈ విషాద ఘటనలో 270 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు అహ్మదాబాద్లోని సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.