భారత్ సమాచార్.నెట్: విదేశీ భాషల (Foreign Languages)పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని పేర్కొన్నారు. అలాంటి సమాజం ఏర్పడటానికి ఎంతో సమయం పట్టదని అభిప్రాయపడ్డారు. భారతీయ సంస్కృతికి ప్రాతినిధ్యం వహించే అంశాల్లో స్థానిక భాషలు ముఖ్యమైనవి అని పేర్కొన్నారు. దేశ భాషలు లేకపోతే మనం నిజమైన భారతీయులం కాదని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి అశుతోష్ అగ్నిహోత్రి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. మన దేశంలో ఒక దశలో ఇంగ్లీషులో మాట్లాడడం గర్వంగా భావించేవారు. కానీ త్వరలోనే, ఆ భాషలో మాట్లాడటాన్ని ప్రజలు ఇబ్బందిగా, సిగ్గుగా అనిపించుకునే రోజులు రావచ్చు. భారతీయ భాషలే భారతీయ సంస్కృతికి విలువైన నిధులు. అవి లేకపోతే మన భారతీయతను నిలుపుకోలేం. ఇప్పుడు దేశ భాషల గౌరవాన్ని తిరిగి పొందాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మన దేశం, మన సంస్కృతి, మన మతాన్ని అర్థం చేసుకునేందుకు పరాయి భాష సరిపోదని వ్యాఖ్యానించారు. విదేశీ భాషలతో సంపూర్ణ భారతీయ భావనను ఊహించుకోలేమన్నారు. ఇది ఎంత కష్టమో తనకు తెలుసని, అయినప్పటికీ ఇందులో భారత సమాజం విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మన దేశంతోపాటు ప్రపంచాన్ని మన సొంత భాషలతోనే నడిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.