భారత్ సమాచార్.నెట్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరు దేశాలు గత వారం రోజులుగా పరస్పరం మిస్సైళ్లు, బాంబులతో దాడులు చేసుకుంటున్నాయి. దీంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరస్థితి ఏర్పడింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో వణికిపోతున్నారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడంతో అక్కడ ఉన్న భారత్ పౌరులకు భారత్ అడ్వైజరీ జారీ చేసింది.
ఇరాన్లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ ఇటీవల తన గగనతలాన్ని మూసివేసింది. తాజాగా భారత్ పౌరుల కోసం ఇరాన్ ఎయిర్ స్పేస్ను తెరిచింది. భారత్ విజ్ఞప్తి మేరకు ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్లోని వివిధ నగరాల్లో చిక్కుకున్న భారత్ విద్యార్థులు, పౌరులు స్వదేశానికి రానున్నారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధులో భాగంగా ప్రత్యేక విమానాల్లో భారత్ పౌరులు స్వదేశానికి చేరుకోనున్నారు. అయితే ఇరాన్లోని పలు నగరాల నుంచి భారత్కు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అందులో తొలి విమానం శుక్రవారం రాత్రి ఢిల్లీకి చేరుకోనుందని సమాచారం. దాని ద్వారా 1000 మంది రానున్నారు. మరో రెండు విమానాలు శనివారం ఢిల్లీలో ల్యాండ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది.