భారత్ సమాచార్.నెట్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహా ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ సిద్ధమైంది. జూన్ 21న ఆంధ్రప్రదేశ్లో ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. విశాఖ సముద్ర తీరణ సుమారు 5 లక్షల మందితో యోగా ప్రదర్శన నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మెగా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే ప్రధాని మోదీ ఏపీకి వచ్చారు.
ఈ సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం ఏర్పాట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖ ఎంపీ భరత్లతో ప్రధాని ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందని, దీని ద్వారా ప్రపంచం ఏపీ వైపు చూసేలా చేశారని ప్రధాని మోదీ అభినందించారు. ఏపీ నేతల పనితీరు అద్భుతంగా ఉందని ప్రధాని ప్రశంసించారు.
అంతకుముందు ఏపీకి వచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సహా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు, స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రధాని నేరుగా ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని, అక్కడి నుంచి నౌకాదళ అతిథిగృహానికి వెళ్లారు. ఈ రాత్రి ఆయన అక్కడే బస చేస్తారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్డులో నిర్వహించే భారీ యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని యోగాసనాలు వేయనున్నారు.