భారత్ సమాచార్.నెట్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను వరంగల్కు తరలించారు. పాడి కౌశిక్ రెడ్డిపై బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు.
రూ. 50 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెదిరించారంటూ కమలాపురం మండలం వంగపల్లిలోని క్వారీ ఓనర్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా కౌశిక్ రెడ్డిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఏప్రిల్లో కేసు నమోదైంది. అయితే ఈ కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి రాష్ట్ర హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం కొట్టేసింది. తాజాగా అదే బెదిరింపు కేసులో కౌశిక్ రెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని వేసిన మరో పిటిషన్ను సైతం హైకోర్టు కొట్టివేసింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.
దీంతో పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. కోర్టులో హాజరుపరిచేందుకు ఆయన వైద్య పరీక్షల కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించనున్నారు. మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ను బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావులు ఖండించారు. ఎయిర్ పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. పాలన గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు.