భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం జరుగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటన చేసే అవకాశం ఉండడంతో ఈ కేబినెట్ భేటీపై ఉత్కంఠ నెలకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్ట్, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతుభరోసా పథకం, కొత్త క్రీడా విధానం వంటి అంశాలపై చర్చించనున్నారు. కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమం కూడా ఉండనుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నగరంలోని సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల పై ఏం చేద్దాం అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కేంద్రానికి అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అధికారులు, మంత్రులతో కూడిన కమిటీ నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన:
ఈ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. జూలైలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికల నిర్వహణపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్ఆర్ఆర్(రిజినల్ రింగ్ రోడ్డు) దక్షిణభాగం అలైన్మెంట్కుకు ఆమోదం తెలపనున్నారు. బాగ్లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలపై చర్చించే అవకాశం ఉంది. రైతుభరోసా విజయోత్సవాల నిర్వహించాలని కూడా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయించనున్నట్లు సమాచారం.