భారత్ సమాచార్.నెట్, యాదాద్రిభువనగిరి: రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక చొరవతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. సర్కారు బడుల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడం, చదువు నాణ్యత పెరగడంతో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. ఫస్ట్ క్లాస్ న్యూఅడ్మిషన్లు నమోదు అవుతుంటే, పైతరగతులకు సంబంధించి ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి విద్యార్థిని విద్యార్థులు సర్కార్ బడుల్లో చేరుతున్నారు.
అందుకే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం:
గత ప్రభుత్వాల కారణంగా క్రమేపీ సర్కారు బడుల పరిస్థితి అధ్వానంగా మారింది. ఉన్న స్టూడెంట్లు ప్రైవేట్ స్కూళ్ల వైపు వెళ్లిపోతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారే లేకుండా పోయారు. దీంతో సర్కారు పాఠశాలల్లో స్టూడెంట్స్ సంఖ్య తగ్గుతూ అనేక స్కూల్స్ మూతబడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో ఇటీవల సర్కారు బడుల్లో స్టూడెంట్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తున్నారు. కంప్యూటర్లు సమకూర్చడంతోపాటు చదువులో వెనకబడిన వారిలో సామర్థ్యాలు పెంచేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ప్రవేశపెట్టారు. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్ట్ ప్రత్యేకంగా బోధిస్తున్నారు.
మూతపడ్డ స్కూళ్లే ఇప్పుడు తెరుచుకున్నాయి:
ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల మోత పెరగడం, అప్పులు చేసి తమ పిల్లలను చదివించడంతో నిరుపేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడం, నాణ్యమైన విద్య అందిస్తుండడంతో ప్రజలు క్రమేపీ సర్కారు స్కూళ్ల వైపు చూస్తున్నారు. దీంతో సర్కారు బడుల్లో వేల సంఖ్యలో కొత్తగా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు పెరుగుతూ వస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో వివిధ తరగతులు చదువుతున్న వారు కూడా సర్కారు బడి బాట పట్టడంతో గతంలో మూతపడిన కొన్ని స్కూళ్లను కూడా తిరిగి తెరిచారు.
అత్యధికంగా యాదాద్రి జిల్లాలోనే:
యాదాద్రిభువనగిరి జిల్లాలో 715 స్కూల్స్ ఉండగా స్టెంత్ తగ్గడంతో 65 స్కూళ్లను మూసివేశారు. తాజా పరిణామాలతో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు మూతపడిన స్కూళ్లను ఏడింటిని తిరిగి తెరిచారు. ఇప్పుడు జిల్లాలో 657 స్కూల్స్ ఉండగా, ఇప్పటివరకు 5,306 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. వీరిలో ఫస్ట్ క్లాస్లో 2,473 మంది చేరగా, ప్రైవేట్ స్కూళ్లలో వివిధ తరగతులు చదువుతున్న 2,833 మంది చేరారు. దీంతో స్టూడెంట్ల సంఖ్య 40,312కు చేరింది.
జిల్లాలోనే కోదాడలో భారీగా పెరిగిన అడ్మిషన్లు:
సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది కొత్తగా 5,289 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. 950 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, 75వేల మంది విద్యార్థులు ఉన్నారు. 5,289 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు పొందారు. కోదాడ మండలంలో అత్యధికంగా 708, మఠంపల్లిలో అత్యల్పంగా 79మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. మూతపడిన 95 స్కూళ్లలో 12 స్కూళ్లను తిరిగి తెరిచారు.
జిల్లాలో 65కు పైగా స్కూళ్లు తెరుచుకున్నాయి:
నల్గొండ జిల్లాలో మొత్తం 1,484 స్కూల్స్ ఉండగా, 6,1073 మంది విద్యార్థులు ఉన్నారు. జీరో డ్రాప్ అవుట్ స్కూల్స్ 250 ఉన్నాయి. తాజాగా 7,529 మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. మరో 2వేల మంది విద్యార్థులు ఇతర క్లాసుల్లో కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు. జీరో డ్రాప్ ఔట్ స్కూల్స్ 250వరకు ఉండగా, ఈ ఏడాది దాదాపు 65కిపైగా మూతపడిన పాఠశాలలు తెరుచుకున్నాయి. వీటిలో దాదాపు 128మంది విద్యార్థులు కొత్తగా అడ్మిషన్లు తీసుకున్నారు.