Homebreaking updates newsNational Turmeric Board: అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం

National Turmeric Board: అమిత్ షా చేతుల మీదుగా నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం

భారత్ సమాచార్.నెట్: పసుపు సాగు చేస్తున్న రైతుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డును కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ నెల 29న ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో జరగనున్న రైతు సభ ఏర్పాట్లను గురువారం కిషన్‌రెడ్డి పరిశీలించారు. స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో ఈ సమావేశం నిర్వహించనుండగా ఎంపీ ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ఇతర అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. పసుపు రైతుల ఆకాంక్ష పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశారని.. అనేక పార్టీలు హామీలు ఇచ్చాయని.. కానీ ప్రధాని మోదీ ఆశీస్సులతో పసుపు బోర్డు ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పసుపు బోర్డుకు సంబంధించిన కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాద్ ఎంపిక చేయడం గొప్ప నిర్ణయమన్నారు. పసుపు ఎక్కువ ఉత్పతి చేసే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో బోర్డు ఏర్పాటు కోసం అడిగారని, కానీ ప్రధాని మోదీ ప్రత్యేకంగా నిజామాబాద్‌ను ఎంపిక చేయడం గొప్ప బహుమతి అని అభివర్ణించారు.

పసుపు బోర్డు చైర్మన్‌గా జిల్లాకు చెందిన రైతుబిడ్డ పల్లె గంగారెడ్డిని నియమించడం గొప్ప నిర్ణయమన్నారు. దేశవ్యాప్తంగా పసుపు ఉత్పత్తిని పెంచేందుకు, భారతదేశానికి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం తీసుకురావడం లక్ష్యంగా కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి కార్యాచరణను రూపొందిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా ఆయన స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకు అప్పగించాలన్నదే బీజేపీ డిమాండ్ అని స్పష్టం చేశారు. అధికారంలోకి రాకముందు ఈ కేసును సీబీఐకీ ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments