భారత్ సమాచార్.నెట్: ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథ రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ క్షేత్రం మొత్తం జనసందోహంగా మారిపోయింది. పూరీ నగర వీధులన్నీ జై జగన్నాథ్.. ‘హరిబోల్’ నినాదాలతో ప్రతిధన్విస్తున్నాయి. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని ఒడిశా సర్కార్ విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ తొలిసారిగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది.
12 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో జగన్నాథుడు, అతని సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర పూరి జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయానికి వారి వారి రథాలపై ప్రయాణిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవస్థానం దాదాపు రెండు నెలల ముందు నుంచే ప్రారంభించింది. గుండిచా ఆలయానికి ఊరేగింపుగా తరలివెళ్లిన బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు వారం రోజుల పాటు అక్కడా సేదతీరతారు. ఆ తర్వాత బహుదా యాత్ర ద్వారా ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు.
ఈ యాత్రను చూడటం ఒక అదృష్టంగా భావిస్తారు భక్తులు. ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు, ఆయన సోదరసోదరీమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. జూన్ 27న మొదలైన ఈ రథయాత్ర జులై 8న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా ఇలానే పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంది.
ఈ యాత్రను వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివరానున్న నేపథ్యంలో.. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు10,000 మంది భద్రతా సిబ్బందిని నియమించింది ఒడిశా సర్కార్. యాంటీ-సాబోటేజ్ బృందాలు, బాంబ్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించింది. రథయాత్ర దృష్ట్యా ఒడిశాలోని సముద్రతీరంలోనూ భద్రత పెంచారు. కీలక ప్రాంతాల్లో 275కు పైగా ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.