భారత్ సమాాచార్, రాజకీయం : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు ఆగుతుందని కేసీఆర్ కారుకూతలు కూస్తున్నారని, నల్లమల జనజాతరను చూసి ఫామ్ హౌస్ లో మందుకొట్టి పండుకున్న కేసీఆర్ కు గుండెలదురుతాయని కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మండిపడ్డారు. మంగళవారం ఆయన నాగర్ కర్నూల్ జిల్లా బిజినెపల్లి, అచ్చంపేట, వనపర్తి నియోజవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే ఆయన కుటుంబం బిచ్చమెత్తుకునేది విమర్శించారు.
డిసెంబర్ 9వ తేదీ రకు ప్రజలు కొంచెం ఓపిక పట్టి ఉండాలని, ఆరోజు ఎల్బీ స్టేడియంలో సీఎం గా ప్రమాణ స్వీకారం జరిగే సందర్భంగా ఈ ఉత్సాహం మరింత రెట్టింపు కావాలని ఆకాంక్షించారు. పదేండ్ల కేసీఆర్ హయాంలో కమీషన్ల పాలన కొనసాగుతోందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఉద్యమం సమయంలో పాలమూరు ప్రజలు కేసీఆర్ ను ఎంపీగా గెలిపిస్తే.. ఆయన పాలమూరును పడావుకు పెట్టిన విషయం నిజం కాదా? అని స్థానిక ప్రజలను ప్రశ్నించారు. తాను పుట్టి పెరిగిన పాలమూరు గడ్డ తనకు 14 సీట్లు గెలిపించి ఇస్తే.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా భారీ ఎత్తున ఎగురేస్తామని రేవంత్ చెప్పారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని చెప్పి.. రాష్ట్రాన్ని ఆయన అప్పుల పాలు చేశారన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లకు ఇచ్చిన నిధులు పాలమూరుకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని సభా ముఖంగా డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక 1.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ చెపుతున్నా మాటలు శుద్ధ అబద్ధాలు అని ఆరోపించారు. కేవలం 21 వేల ఉద్యోగాలే భర్తీ చేశారని చెప్పారు. పదేండ్ల సీఎం కేసీఆర్ పాలనలో రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యమకారులకు.. ఇలా అన్ని వర్గాలకు అన్యాయమే జరిగిందని వాపోయారు. సీఎం కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో ఎలాగైనా సాగనంపాల్సిందేనని ప్రజలకు పిలుపునిచ్చారు. భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి ఓటర్లను కోరారు.