భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కి ప్రత్యామ్నాయం తానే అని బరిలోకి దిగిన బీజేపీ పార్టీ ఎన్నికల ఫలితాలలో 8 సీట్ల దగ్గరే ఆగిపోయింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అర్వింద్.. వంటి ప్రముఖులు ఓడిపోవడం ఆ పార్టీని నైరాశ్యంలో ముంచింది. కేంద్రంలో మోడీ హవా నడుస్తున్నా తెలంగాణలో పార్టీ మూడో స్థానానికి పడిపోవడం వారిని షాక్ కు గురి చేసింది.
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని.. రాష్ట్రంలో కీలక సమస్యల్లో ఒకటైన ఎస్సీ వర్గీకరణ, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు..వంటివి అమలు చేస్తామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో హామీ కూడా ఇచ్చింది. ఎన్నికలకు ముందే ఎస్సీ వర్గీకరణ కోసం ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా వేసింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో కలిసి ఎన్నికల సభలు నిర్వహించి, ప్రచారం సైతం చేయించారు. మాదిగలకు తమ పార్టీ ఎంతో ప్రాధాన్యమిస్తోందని చెప్పుకోవడానికి చేయాల్సిందంతా చేశారు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రచారాస్త్రాం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కాకపోతే గతంలో కంటే కొన్ని సీట్లు, కొంచెం ఓట్ల శాతం మాత్రం పెంచుకోగలిగింది. ఇక ఇటీవలే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు పార్లమెంట్ ఆమోదం కూడా తెలిపింది.
ఈ క్రమంలోనే వరంగల్ ఎంపీ(ఎస్సీ) స్థానం నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను లోక్ సభ ఎన్నికల బరిలో నిలపాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణ తమతోనే సాధ్యమని.. ఆ వర్గాలకు భరోసా కల్పించే ప్రయత్నంగా కమిటీ కూడా వేసిన విషయం తెలిసిందే. కృష్ణ మాదిగ కూడా వరంగల్ కు స్థానికుడు కావడం లాభిస్తుందని పార్టీ కేంద్ర నాయకత్వం కూడా అభిప్రాయపడుతోంది. తద్వారా తెలంగాణలో భారీగా ఉన్న మాదిగల ఓట్లను తమ వైపుకు ఆకర్షించవచ్చని ఎన్నికల ప్రణాళికలు రచిస్తోంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో మటుకు అసెంబ్లీ ఎలక్షన్స్ లాగా కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా సరే తెలంగాణ నుంచి అత్యధిక పార్లమెంటు స్థానాలే లక్ష్యంగా పావులు కదుపుతోంది.