భారత్ సమాచార్, రాజకీయం : పార్టీ అధ్యక్ష పదవి పోయిన ఫ్రస్టేషన్ లో ఎంపీ బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి పూడే మండిపడ్డారు. ఎంపీగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఇలా మాట్లాడటం సబబు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పై అవాకులు చెవాకులు పేలితే ఆ ఎంపీకి బడితపూజ తప్పదన్నారు. ఆయన నోరు జారితే, ఇలాంటివి రిపీట్ అయితే మేము చేతికి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిల్లీకి వెళ్తారని పత్రికల్లో వార్తలు వస్తె, తప్పు పడుతున్న బండి సంజయ్, ఎంపీగా తను, కిషన్ రెడ్డి ఎందుకు డిల్లీ వెళ్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ గ్రూపు తగాదాలు భరించలేక బండి సంజయ్ అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. భూతులు మాట్లాడుతూ తన స్థాయిని రోజు రోజుకు వీధి రౌడీలా దిగజార్చుకుంటున్నారని ఆరోపించారు.
పొత్తుల గురించి మాట్లాడుతున్న బండి సంజయ్ ఎవరిని ఉద్దేశించి, ఆ వ్యాఖ్యలు చేశారో చెప్పాలన్నారు. బీజేపీతో పొత్తు కావాలని ఆయనని ఎవరు అడిగారో తెలపాలన్నారు. తెలంగాణకు విభజన హామీలు, నిధులు ఇవ్వడంలో వివక్ష చూపిన బీజేపీ ఎన్నటికీ రాష్ట్ర శత్రువే అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనతో సహా వారి పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ మట్టు బెట్టిందన్నారు. ఓడిపోతామనే భయంతోనే పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు. కేసీఆర్ పై ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వారికి ప్రజలే బుద్ది చెబుతారన్నారు. బీజేపీ లో జాతీయ స్థాయి పదవి ఉన్నా, వారి పరిస్థితి గల్లీ లీడర్ కంటే అధ్వాన్నంగా మారిందన్నారు. అందుకే వారి ఉనికి చాటుకునేందుకు నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలే చేస్తుంటే ప్రజలు వారిని రోడ్డు మీద కూడా తిరగనియ్యరని చెప్పారు.