భారత్ సమాచార్, రాజకీయం : ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేయాలనుకునే లబ్దిదారులకు ప్రభుత్వం అధికారిక గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ పేరు మీద మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు అందచేయనున్నారు.
జిల్లాల వారిగ నియమించిన ఇన్చార్జి మంత్రిని సంప్రదించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అలాగే ఆర్థిక సహాయం, పంపిణీలో గ్రామ, మండల స్థాయిలో అధికారులను నియమిస్తారు. లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాత గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో సభలు నిర్వహించి జాబితాను ప్రకటిస్తారు.
ఆరు గ్యారంటీల్లో భాగంగా సొంత స్థలం ఉన్న వారికి 100 శాతం సబ్సిడీతో రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4 లక్షల 50 వేల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్లను పరిగణనలోకి తీసుకొని లబ్ధిదారులను ఎంపిక
చేస్తారు. కాగా ఇప్పటికే ఈ పథకాన్ని సోమవారం బూర్గంపాడులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు.
ప్రభుత్వ అధికారిక గైడ్ లైన్స్ ఇవే
1. రేషన్ కార్డు ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారు అర్హులు.
2. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది.
3. లబ్ధిదారులు గ్రామం లేదా అర్బన్ లోకల్ బాడీలో కచ్చితంగా నివాసితుడై ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా అర్హులే.
4. లబ్ధిదారుల ఎంపికను జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన కలెక్టర్లు ఫైనల్ చేస్తారు. గ్రామ పంచాయతీల జనాభాకు అనుగుణంగా ఎంపిక ఉంటుంది.
5. 400 చదరపుఅడుగుల విస్తీర్ణంలో ఆర్సీసీ పద్ధతిలో ఇళ్లు నిర్మించాలి.
6. లబ్ధిదారుల ఎంపిక తరువాత ఆ లిస్టును గ్రామ సభలు, పట్టణాల్లో అయితే వార్డు మీటింగ్స్ లో ప్రవేశపెడతారు.
నాలుగు దశల్లో ఆర్థిక సాయం
1.బేస్మెంట్ లెవల్ వరకూ రూ.1 లక్ష
2.స్లాబ్ లెవల్ వరకూ రూ.1 లక్ష
3.స్లాబ్ పూర్తయిన తర్వాత రూ.2 లక్షలు
4.ఇళ్లు పూర్తయిన తర్వాత రూ.1 లక్ష
కాగా జిల్లా కలెక్టర్లు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమోదించిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ ఫండ్స్ రిలీజ్ చేసి ఆర్థిక సాయాన్ని డీబీటీ ( డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ ) పద్ధతిలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారులకు చెల్లిస్తారు.