Homemain slides‘వైసీపీ అంటే గూండాల పార్టీ’

‘వైసీపీ అంటే గూండాల పార్టీ’

భారత్ సమాచార్, పిఠాపురం ;

‘‘వైసీపీ అంటే గూండాల పార్టీ. ఈ ఐదేళ్ల కాలంలో ఒక్కరిని కూడా ప్రశాంతంగా బతకనివ్వలేదు. వాళ్ల అరాచకాలు, దాష్టీకాలు చూసి ఎవరికైనా వీధుల్లోకి రావాలంటే భయం.. రోడ్ల మీద తిరగాలంటే భయం. హక్కులు హరించారు అని చెప్పడానికి కూడా భయం. ఇంతలా ప్రజలను భయపెట్టిన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడు లేవ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. వైసీపీ పుట్టించిన ఆ భయాన్ని పోగొట్టింది జనసేన పార్టీ, జన సైనికులు, వీర మహిళల పోరాటమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కి వ్యతిరేకంగా నామినేషన్లు వేసి జగన్ అహాన్ని అణిచి వేశారని చెప్పారు. ఈ రోజు జగన్ భయపడుతున్నాడంటే ఒక్క జనసేన పార్టీకేనని అన్నారు. జనసేన పార్టీని ఒక్క ఎన్నికల కోసం స్థాపించలేదన్నారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం స్థాపించానని తెలిపారు. ఒక తరం కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

ధర్మో రక్షతి రక్షితః

మా నాన్న చిన్న ప్రభుత్వ ఉద్యోగి. మాకు ఆస్తిపాస్తులు ఏమీ పెద్దగా ఇవ్వలేదన్నారు. మాకు చిన్నప్పటి నుంచి ఒకటే నేర్పించాడు. ధర్మంగా బతకాలని మాత్రమే చెప్పేవారన్నారు. ధర్మో రక్షతి రక్షిత: అని.. ధర్మాన్ని మనం రక్షిస్తే అదే మనల్ని కాపాడుతుందని చెప్పేవారన్నారు. ఇప్పటికీ అదే పాటిస్తున్నానని ప్రజలకు చెప్పారు. ధర్మం కోసమే ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, నోటికొచ్చినట్లు నన్ను బూతులు తిట్టినా భరించానన్నారు. రాజకీయాలు అంటే తెలియని నా భార్యను కూడా ఇష్టానుసారం మాటలు అన్నారని వాపోయారు. నా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నాకు మద్దతుగా ప్రచారం చేయడానికి వస్తే ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. బీర్ బాటిల్ విసిరి తలపగలగొట్టాలని చూశారన్నారు. ఆ బాటిల్ దురదృష్టవశాత్తు తెలుగుదేశం కార్యకర్తకు తగిలి తలకు గాయమైందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.

బీజం పిఠాపురంలోనే పడాలి

2024 సార్వత్రిక ఎన్నికలు మన భవిష్యత్తుకు చాలా కీలకం కానున్నాయన్నారు. ఇవి రాష్ట్ర దశ, దిశను నిర్దేశించే ఎన్నికలన్నారు. దేశంలోనే బలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగాలంటే దానికి బీజం పిఠాపురం గెలుపుతోనే మొదలవ్వాలని వ్యాఖ్యానించారు. జనసేన అంటే డబ్బుకు అమ్ముడుపోయే పార్టీ కాదన్నారు. సారా ప్యాకెట్, బిర్యానీ పొట్లానికి వచ్చే కార్యకర్తలు ఈ పార్టీలో లేరన్నారు. దశాబ్ద కాలంగా చట్టసభల్లో స్థానం లేకపోయినా బలంగా నిలబడి ఉన్నామని తెలిపారు. అంటే దానికి ముఖ్య కారణం మన భావజాలం, సిద్ధాంతాలకు ఆకర్షితులై గుండెల్లో పెట్టుకున్న జనసైనికులు, వీరమహిళలేనని తెలిపారు . ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన మన పార్టీ మద్దతుదారులు కనిపిస్తారన్నారు.

కడుపు మండినోడు రోడ్లు మీదకు వస్తే సంగ్రామమే

సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం… మనిషి నుంచి మనిషికి రెండు గుండెల దూరం.. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని ప్రముఖ రచయిత గుంటూరు శేషేంద్ర శర్మ అన్నారని వ్యాఖ్యానించారు. ఈ రోజు పచ్చగా, కళకళలాడాల్సిన పల్లెలు వైసీపీ పాలన అరాచకాలతో వెలవెలబోతున్నాయన్నారు. రైతులకు సాగునీరు లేదన్నారు. ప్రజలకు తాగు నీరు దొరకడం లేదన్నారు. ఇలా వైసీపీ పాలనపై కడుపు మండినోడు రోడ్లు మీదకు వస్తే… గ్రామం నుంచి సంగ్రామానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పారు. నేను ఎప్పుడు గొంతెత్తినా ఒక కులం కోసమో… ప్రాంతం కోసమో గొంతెత్తలేదు. కష్టాల్లో ఉన్న ప్రతి మనిషి కోసం గొంతెత్తానన్నారు. కులాల వెనకబాటుతనాన్ని గుర్తించే వాడినే తప్ప… కులాలతో రాజకీయం చేసేవాడిని కాదు. అరాచకం, రౌడీయిజం రాజ్యమేలుతుంటే 5 కోట్ల మంది ప్రజలు నెగ్గాలని మాకు మేము తగ్గామని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర అభివృద్ధికి కొత్త బాటలు వేస్తాం

పిఠాపురం అన్నదమ్ములు, ఆడపడుచులు, పెద్దలకు ఒకటే చెబుతున్నాను… కులాలు, మతాలకు అతీతంగా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టాలంటే ముందుంటానని తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే విద్యా, వైద్యం, సాగు నీరు, తాగు నీరు, ఉపాది, లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక దృష్టి పెడతామని వ్యాఖ్యానించారు. ప్రతి మండల కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామన్నారు. దేశం మన వైపు చూసేలా ఉప్పాడ నుంచి కాకినాడ బీచ్ ను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని హామి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు మెగా డీఎస్సీ నిర్వహిస్తాంమన్నారు. ప్రకటించిన సమయానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామి ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని గ్యారంటీ ఇచ్చారు. వైసీపీ వారు రాష్ట్రాన్ని దోచుకోవడానికి దారులు వెతికారు. మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిబాటకు కొత్త మార్గాలు వెతుకుతామన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులు, పోలవరం కూడా సకాలంలో పూర్తి చేసి చూపిస్తామన్నారు. పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. పిఠాపురం రూపురేఖలు మారుస్తామన్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అనే నేను, కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నాం, మమ్మల్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మరికొన్ని రాజకీయ విశేషాలు…

అన్యాయం కాదు… నేరాలు, పాపాలు

RELATED ARTICLES

Most Popular

Recent Comments