భారత్ సమాచార్, జాతీయం ;
సాధారణంగా మే నెల వస్తుందంటేనే భయంకరమైన ఎండలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాలులు అని భయపడుతుంటాం. దీనికి భిన్నంగా ఈ ఏడాది చల్లని మే నెలని చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు కారణం ఏదైనా ఈ సమ్మర్ హాలిడేస్ లో మే నెల ఎండల నుంచి ప్రజలకు కొంచెం ఉపశమనం లభించిన మాటవాస్తవం. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరో ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు…
తాజాగా హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్, గుజరాత్ మధ్య కీలక మ్యాచ్ కూడా రద్దైన సంగతి తెలిసిందే. మరో ఐదు రోజులు వర్షాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కేంద్రీకృతమై ఉంది. మరో 5 రోజులు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఐదు రోజులపాటు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ ఏడాది ఆశాజానకంగా వర్షాలు
తెలుగు రాష్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని ఆశాభావ వార్త చెప్పింది. ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని వెల్లడించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ముందస్తు రుతుపవన వర్షాలు (ప్రీ మాన్సూన్ రెయిన్స్) ప్రారంభమయ్యాయని పేర్కొంది. దక్షిణ విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక వద్ద ఉపరితల ద్రోణి తాకనుంది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మే 31నే కేరళకు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత… తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఆశాభావం వక్తం చేస్తున్నారు.