భారత్ సమాచార్, దిల్లీ ;
బ్రిజ్భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశరాజధానిలో రెజ్లర్లు ఆందోళన చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. భారత మహిళ రెజ్లర్ల తీవ్ర పోరాటంతో బ్రిజ్ భూషణ్ ఛార్జిషీట్ నమోదైంది. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించబడిన బిజెపి ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) మాజీ ఛీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎట్టకేలకు ఛార్జిషీట్ నమోదైంది. అతడిపై ఢిల్లీ కోర్టు తాజాగా అభియోగాలు నమోదు చేసింది. క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడటం, ఆపై బెదిరింపులకు దిగడం వంటి అభియోగాలు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై నమోదయ్యాయి. అతడితో పాటు ఈ కేసులో సహా నిందితుడిగా ఉన్న డబ్ల్యుఎఫ్ఐ మాజీ సహాయక కార్యదర్శి వినోద్ తోమర్పై కూడా బెదిరింపులకు పాల్పడిన నేరం కింద అభియోగాలను కోర్టు నమోదు చేసింది. కాగా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఎసిఎంఎం) ప్రియాంక రాజ్పూత్ ముందు విచారణకు హాజరైన బ్రిజ్భూషణ్ తన నేరాన్ని అంగీకరించలేదు. ‘నేను దోషి కానప్పుడు నేను ఎందుకు నేరాన్ని అంగీకరిస్తాను’ అని వాదించారు.
ఈ వివాదం నేపథ్యంలోనూ బ్రిజ్ భూషణ్తో బీజేపీ తన అనుబంధాన్ని కొనసాగించింది. బ్రిజ్భూషణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభ స్థానం నుంచి అతడి కుమారుడు కరణ్ భూషణ్ సింగ్ను బీజేపీ ఎన్నికల బరిలో నిలిపింది.