భారత్ సమాచార్.నెట్, మెదక్: ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగ్ వ్యసనంతో డబ్బంతా పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా తెలిసిన వాళ్ల దగ్గర కూడా అప్పులు చేశాడు. బెట్టింగ్ మాయలో పడి తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
బెట్టింగ్ పెట్టి.. పురుగులమందు తాగి:
రామాయంపేట మండలం ప్రగతిధర్మారం గ్రామానికి చెందిన దొమ్మాట నర్సింలు కుమారుడు దొమ్మాట భానుప్రసాద్(24) గత కొన్నిరోజులుగా ఆన్లైన్లో గేమ్లు ఆడుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడిన భాను ప్రసాద్ రూ.1.50 లక్షలు పోగొట్టుకున్నాడు. పైగా తెలిసిన వారి వద్ద కూడా అప్పులు చేశాడు. ఆర్ధికంగా నష్టపోయిన భాను ప్రసాద్ తీవ్ర మనస్తాపానికి గురై ఐదురోజుల క్రితం తమ వ్యవసాయ బావివద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రామాయంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానకు అతడిని తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ భాను ప్రసాద్ మృతి చెందాడు. ఒక్కగానొక్క కొడుకు కళ్ల ఎదుటే చనిపోవడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
మరిన్ని కథనాలు: