భారత్ సమాచార్,అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటుగా కేబినెట్ మీటింగ్ ను నిర్వహించారు. అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ సమావేశాన్ని నిర్వహించారు.ఇందులో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ప్రతినిధులు, అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. మంత్రి మండలి ఆమోదించిన వాటిల్లోని హైలెట్స్ ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కె.పార్థసారధి మీడియాకు వివరించారు.
మెగా డీఎస్సీ…
మెగా డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్న 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 రద్దు…
ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 2022 (యాక్టు సంఖ్య 27 ఆఫ్ 2023) రద్దు చేసే ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఎన్టీఆర్ భరోసా పింఛన్…
సామాజిక పింఛన్లకు సంబంధించి గతంలో ఉన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్పు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేల రూపాయలకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. పెంచిన పెన్షన్ పెంపుదల నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.33వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. ఈ మేరకు రూ.4 వేలకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్ లకు పెరిగిన రూ. వెయ్యి రూపాయల చొప్పున కలిపి ప్రతి పింఛన్ దారుకు మొత్తంగా రూ.7 వేల పింఛన్ ల మొత్తాన్ని జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో ఇంటివద్దనే అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది.దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ ను రూ.3 వేల నుంచి రూ.6 వేల రూపాయలకు పెంచడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024…
రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన యువత ఎంతో అవసరం. అది గుర్తించిన మన ప్రభుత్వం అందుకనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024 నిర్వహణకు తొలి మంత్రి మండలిలోనే ఆమోదం తెలియజేసింది.
అన్నా క్యాంటీన్…
రాష్ట్రం లోని పేదవారి ఆకలి దప్పులను తీర్చే లక్ష్యంతో సబ్సిడీ ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు గతంలో మంజూరు చేసిన అన్నా క్యాంటీన్లను పున: ప్రారంభించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం…
విజయవాడలోని డా.వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పునర్ నామకరణం చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
7 శ్వేత పత్రాలు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.ప్రజల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదల చేయాల్సిందిగా మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ నెల 28 నుండి జులై 18 వరకు రెండు మూడు రోజులకొకసారి శ్వేత పత్రాలు విడుదల చేయటానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
మంత్రులతో సబ్ కమిటీ…
మత్తు, మాదక ద్రవ్యాల వినిమయం రాష్ట్రంలో అధికమైన నేపథ్యంలో వాటి నుండి యువతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేందుకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, హోం, ఎక్సైజ్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి శాఖల మంత్రులు ఉంటారు.
