భారత్ సమాచార్, జాతీయం ;
కరోనా గాయాలు ఇంకా పూర్తిగా మర్చిపోక ముందే జికా వైరస్ భారతదేశాన్ని కలవరపెడుతోంది. ప్రస్తుతం పూణేలో ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో 6 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి.వీరిలో ఇద్దరు గర్భిణులు కూడా ఉన్నారు.ఈ సమాచారం అందిన వెంటనే ఆరోగ్య శాఖలో కలకలం రేగింది. పూణేలోని ఎరంద్వానే, ముంద్వాలో జరిపిన విచారణలో ఆరుగురు రోగుల్లో జికా వైరస్ ఇన్ఫెక్షన్ నిర్ధారించబడిందని ఒక అధికారి తెలిపారు. ఈ వైరస్ వ్యాాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు అధికారులు వెల్లడించారు.
జికా వైరస్ ఎప్పుడు వెలుగులోకి వచ్చిదంటే
ఈ వైరస్ మొదటి కేసు 1947 లో వెలుగులోకి వచ్చింది. ఉగాండాలోని కోతులకు ఈ వైరస్ సోకింది. అయితే మానవులలో జికా వైరస్ మొదటి కేసు 1952లో నమోదైంది. గత కొన్నేళ్లుగా వివిధ దేశాల్లో జికా కేసులు నమోదవుతున్నాయి. అక్టోబర్ 2015, జనవరి 2016 మధ్య బ్రెజిల్లో వేల సంఖ్యలో జికా కేసులు నమోదయ్యాయి. ఈ దేశంలో 4000 మంది పిల్లలకు జికా వైరస్ సోకినట్లు నిర్ధారించారు.
జికా వైరస్ లక్షణాలు, నివారణ ఏమిటంటే
వైద్యులు ప్రకారం జికా వైరస్ సోకిన రోగులకు జ్వరం ఉంటుంది. రోగులు తలనొప్పి, కీళ్ల నొప్పి వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. కళ్లు ఎర్రబడతాయి. శరీరంపై ఎర్రటి దద్దుర్లు కూడా కనిపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. కనుక ఇంటి చుట్టూ నీరు పేరుకు పోనివ్వవద్దు. రక్షణ కోసం పూర్తి చేతులను కవర్ చేసే విధంగా దుస్తులు ధరించండి. వ్యాధి సోకిన రోగులు నివసించే ప్రాంతాలకు వెళ్లవద్దు. తినే ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచించారు.