భారత్ సమాచార్, అమరావతి ;
2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అని వైకాపా నాయకులు విమర్శించేవారు. ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ ఎలా రివర్స్ అయిందో అందరికి తెలిసిందే. 100 శాతం స్ట్రయిక్ రేట్ తో జనసేన అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలోనూ జనసేన పార్టీ తరపు అభ్యర్థి పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు… రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన తెలిపారు.. “ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నాను. నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, జనసేన, టీడీపీ నాయకులకు ధన్యవాదాలు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. శాసన మండలి తొలి సమావేశాల ప్రారంభానికి సమయం ఉన్నందున కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు, చర్చ, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశాలపై అధ్యయనం చేయడానికి నాకు ఈ సమయం ఉపయోగపడుతుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చిల్లపల్లి శ్రీనివాస్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, చోడిశెట్టి చంద్రశేఖర్, తాడిశెట్టి నరేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.